– ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి
– అలసత్వానికి తావులేకుండా విధులు నిర్వర్తించండి
– అధికారులకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
గురువారం కలెక్టర్ లక్ష్మీశ యూపీఎస్సీ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఎన్.రాజేశ్వరరావుతో కలిసి కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో సివిల్స్ మెయిన్స్పై ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. కస్టోడియన్, లైజనింగ్ అధికారులతో పాటు వెన్యూ సూపర్వైజర్లు, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, పోస్టల్, ప్రజా రవాణా, విద్యుత్ తదితర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొనగా పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 124 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 21న పేపర్-1 ఎస్సే, 22న జీఎస్-1, జీఎస్-2, 23న జీఎస్-3, జీఎస్-4, 29న భారతీయ భాష, ఇంగ్లిష్, 30వ తేదీన ఆప్షనల్ సబ్జెక్టులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. బందోబస్తు, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య శిబిరం తదితరాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యూపీఎస్సీ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించేలా చూడాలన్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా అభ్యర్థుల ముఖ ఆధారిత గుర్తింపు ప్రక్రియ విషయంలో జాగ్తత్తగా వ్యవహరించాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా వివిధ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రానికి బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజారవాణా శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News