-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-జగన్మోహనరావుకు ప్రెసిడెంట్ మెడల్ అందించిన గవర్నర్
-ఎపి రెడ్ క్రాస్ సొసైటీకి జాతీయ స్ధాయిలో రాష్ట్రపతి అవార్డు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజిక సేవకు ప్రతిరూపంగా ఆపదలో ఉన్న వారికి అండగా రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు అనుసరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్ భవన్ దర్బార్ హాలులో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రెడ్ క్రాస్ శ్రీకాకుళం శాఖ ఛైర్మన్ పి.జగన్మోహనరావుకు భారత ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ప్రశంసా పత్రాన్ని గవర్నర్ బహుకరించారు. మరోవైపు రెడ్ క్రాస్ సభ్యత్వం విషయంలో జాతీయ స్దాయిలో ద్వితీయ స్ధానాన్ని దక్కించుకున్నందుకుగాను ఎపి రెడ్ క్రాస్ సొసైటీ తరుపున అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి ఎకె ఫరీడాలకు రాష్ట్రపతి అవార్డు, ప్రశంసా పత్రాలను అందించారు. పదిహేను సంవత్సరాలకు పైబడి గణనీయమైన సేవలు అందించిన వారికి దక్కే అరుదైన గౌరవం జగన్మోహనరావుకు దక్కటం మంచి పరిణామమని ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ అన్నారు. ఇటీవల కొత్త డిల్లీ వేదికగా నిర్వహించిన భారత రెడ్క్రాస్ సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్ట్రపతి బంగారు పతకం, ప్రశంసా పత్రం అవార్డుల కోసం ఈ ఎంపికలు చేసారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, సంయిక్త కార్యదర్శి సన్యాసి రావు, రాజ్భవన్ అధికారులు పాల్గొన్నారు.
డిజిటల్ గ్రంధాలయం కోసం విరాళం అందించిన వడ్డే
నెల్లూరు జిల్లా పల్లెపాడులో రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహణలో ఉన్న కొనకా కనకమ్మ ఆశ్రమంలో డిజిటల్ గ్రంధాలయం ఏర్పాటు కోసం మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు తదితరులు గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా విరాళం అందించారు. వ్యక్తిగతంగా వడ్డే రూ.25వేలు, మక్కెన అంకయ్య చౌదరి రూ.25వేలు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ఎకె ఫరీడా, బిఎస్ ఎన్ రెడ్డి, రంగయ్య నాయిడు, గూడూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమానికి చెందిన భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రతినిధులు గవర్నర్ ను కోరారు.
Prajavartha Online Telugu News