-రెవెన్యూ రికార్డులను పరిశీలించి బబ్బెళ్లపాడు రైతుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు
-కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చందర్లపాడు మండలం బబ్బెళ్లపాడు గ్రామ రైతులకు సంబంధించిన భూముల రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు. చందర్లపాడు మండలం బబ్బెళ్లపాడుకు చెందిన బబ్బెళ్లపాటి గోపాలకృష్ణ సాయితో కలిసి గ్రామ రైతులు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వేచి ఉన్నారు. ఈ విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ డిల్లీరావు తానే స్వయంగా కార్యలయం బయట వేచి ఉన్న రైతుల వద్దకు వచ్చి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. బబ్బెళ్లపాడు గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యను జిల్లా కలెక్టర్కు వివరిస్తూ బబ్బెళ్లపాడు గ్రామం గతంలో ముక్త్యాల ఎస్టేట్ పరిధిలో ఉండేదని తదనంతరం మార్పులో 1956లో జమిందారి వంశీకులు భూములను అమ్ముకున్నారని తమ పూర్వీకులు వారి నుండి భూములను కొనుగోలు చేసి సంపూర్ణ హక్కులతో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. రీ సర్వే అనంతరం తమకు చెందిన భూములకు ఆనుకుని ఉన్న శ్రీ వేదాద్రి లక్ష్మి నరసింహ స్వామి భూమి మాకు విక్రయించిన జమిందారుల కుటుంబాల వారి పేర్లు కూడా రెవెన్యూ రికార్డులలో ఉన్నాయని తెలిపారు. ఆర్ఎస్ఆర్లో పొరపాటున నమోదు కాబడిన తమ భూములకు ఎన్వోసి ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గత ఎన్నో సంవత్సరాల నుండి సుమారు 40 కుటుంబాలకు చెందిన రైతులు భూముల క్రయ విక్రయాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కోంటున్నామని తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన పత్రం అందజేశారు. రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లపుడు సిద్దంగా ఉంటానని ఎఫ్ఎల్ఆర్ ప్రకారం రికార్డులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామన్నారు. ఈ విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని భూ సెటిల్మెంట్ కోర్టులో ఫిర్యాదు చేయాలన్నారు. తద్వారా పూర్తి స్థాయిలో విచారణ జరిపి సెక్షన్ 15 ద్వారా తగిన ఉత్తర్వు ఇచ్చేలా చర్యలు తీసుకుని రైతుల సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. కలెక్టర్ను కలిసిన బబ్బెళ్లపాడు గ్రామ రైతులలో వాసిరెడ్డి ప్రసాద్, టి విజయబాస్కరరెడ్డి, యం శ్రీనివాసరెడ్డి జి నవీన్బాబు, జి నర్శిరెడ్డి, కె. శేషాచలం, ఎస్ జనకిరామయ్య, పి నర్శిరెడ్డి, కె. వెంకట రెడ్డి తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News