-నారెడ్కో సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తదుపరి జరగుతున్న తొలి ఎన్నికలలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా తన అభ్యర్దిత్వాన్ని బలపరచాలని మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ విన్నవించారు. స్ధిరాస్తి రంగం అభివృద్దికి. ఆరంగం ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తామన్నారు. నగరంలోని నిర్వహించిన జాతీయ స్దిరాస్తి అభివృద్ది మండలి (నారెడ్కో) సర్వసభ్య సమావేశానికి ఆలపాటి ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటిని ఎంపిక చేసారని నారెడ్కో సెంట్రల్ జోన్ ఛైర్మన్ సందీప్ మండవ సభకు పరిచయం చేసారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ కూటమి అభ్యర్ధిగా తనను ఎంపిక చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసారని, జగన్ అరాచకాల వల్ల అన్ని వర్గాలు తీవ్ర అవస్థలకు గురయ్యారని విమర్శించారు. ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. టీడీపీ, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో స్ధిరాస్తి వృద్ది అందుకు నిదర్శనమన్నారు. చంద్రబాబు వందరోజుల పాలనలో సంక్షేమం, అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. జగన్ పాలనతో నిర్వీర్యమైన వ్యవస్థలను చంద్రబాబు చెక్క దిద్దుకుంటూ వస్తున్నారన్నారు. ఆక్రమంలోనే రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలోని పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకుని కూటమి అభ్యర్దిగా తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నారెడ్కో ప్రతినిధులకు విన్నవించారు. ఆలపాటి ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన నారెడ్కో సభ్యులు తమ సమస్యలను ఏకరువు పెట్టి, పరిష్కరించాలని కోరారు. సమావేశంలో నారెడ్కో ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు పరుచూరి కిరణ్, కోశాధికారి చావా రమేష్, సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి ఎస్ వి రమణ, కోశాధికారి పోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News