విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి.. తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు అజరామరమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి మల్లాది విష్ణు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పోరాట యోధుడని కొనియాడారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్దరణ ఆశయాల కోసం కృషి చేసిన మహనీయుడు అని కీర్తించారు. ఆయన కార్యదీక్ష, పట్టుదల, క్రమశిక్షణ, పోరాట విధానం స్ఫూర్తిదాయకమన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెల్లూరు జిల్లాకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసినట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి ఏటా నవంబర్ 1వ తేదీ నాడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి సంస్మరణ సభలు నిర్వహించడంతో పాటు.. ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాల కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు యరగొర్ల శ్రీరాములు, మేడా రమేష్, వెన్నం రత్నారావు, తోపుల వరలక్ష్మి, పేరం త్రివేణి రెడ్డి, ఎం.శ్రీలక్ష్మి, బంకా బాబీ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News