-APHDC క్రాఫ్ట్టెక్ హ్యాకథాన్–2026 తుది పోటీల్లో డా. పసుపులేటి హరిప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంప్రదాయ హస్తకళలకు ఆధునిక సాంకేతికత, డిజైన్, ఆవిష్కరణలను అనుసంధానం చేసి కళాకారులకు కొత్త మార్కెట్లు, మెరుగైన జీవనోపాధి అవకాశాలు కల్పించడమే APHDC క్రాఫ్ట్టెక్ హ్యాకథాన్–2026 ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (APHDC) చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ గారు అన్నారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) నందు APHDC ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాఫ్ట్టెక్ హ్యాకథాన్–2026 తుది పోటీ, ప్రోటోటైప్ ప్రదర్శన మరియు మూల్యాంకన కార్యక్రమానికి డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 60 మంది కళాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా, ప్రతిభ ఆధారంగా 12 మందిని తుది దశకు ఎంపిక చేశారు. తుది మూల్యాంకన అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేశారు. OSD లక్ష్మీనాథ్, DCH అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణా లక్ష్మి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్కు చెందిన మాధవరావు తదితరులు జ్యూరీ సభ్యులుగా పాల్గొని ప్రోటోటైప్లను పరిశీలించి మూల్యాంకనం చేశారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, “మన సంప్రదాయ హస్తకళలు మన సాంస్కృతిక సంపద. వాటికి సాంకేతికత, ఆధునిక డిజైన్, మార్కెట్ అవసరాలను జోడిస్తే మన కళాకారుల ప్రతిభకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుంది” అని అన్నారు. కళాకారుడి చేతిలోని సంప్రదాయ నైపుణ్యానికి సాంకేతికత తోడైతే.. ఆ కళకు కొత్త మార్కెట్, కళాకారుడికి కొత్త భవిష్యత్తు ఏర్పడుతుంది అని ఆయన పేర్కొన్నారు. కేవలం పోటీలకే పరిమితం కాకుండా, అత్యుత్తమ ప్రోటోటైప్లను భవిష్యత్తులో ఉత్పత్తులుగా అభివృద్ధి చేసి, మార్కెట్కు అనుసంధానం చేసే దిశగా APHDC కృషి చేస్తుందని డా. హరిప్రసాద్ తెలిపారు. “సంప్రదాయం నుంచి ఆవిష్కరణ వైపు.. ఆవిష్కరణ నుంచి మార్కెట్ వైపు” అనే లక్ష్యంతో APHDC ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హస్త కళా నైపుణ్యాభివృద్ధి సంస్థ డైరెక్టర్ RDS ప్రసాద్, యశస్వినీ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News