-ఓటర్ జాబితాలో తమ వివరాలను పరిశీలించుకోవాలి: వీఎంసీ కమిషనర్, డెప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 22, 23 మరియు 29, 30 తేదీల్లో అనగా శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు డెప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ధ్యానచంద్ర తెలిపారు.
ఈ ప్రత్యేక క్యాంపెయిన్ డేస్లో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు (BLOలు) ముసాయిదా ఓటర్ జాబితాతో పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని కమిషనర్ పేర్కొన్నారు.
ప్రజలు తమ ఓటు వివరాలను ముసాయిదా ఓటర్ జాబితాలో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. ఓటర్ జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునేవారు, పేరు లేదా ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు, సవరణలు చేయించుకోవాలనుకునేవారు, అలాగే ముసాయిదా ఓటర్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నవారు సంబంధిత పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న BLOలను సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చని తెలిపారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ను సద్వినియోగం చేసుకుని తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలని, ఓటర్ జాబితాలో ఏవైనా తప్పులు లేదా మార్పులు అవసరమైతే నిర్ణీత ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు ఓటర్ జాబితా సంబంధిత సందేహాలు, సహాయం అవసరమైన పక్షంలో ఎన్టీఆర్ జిల్లా హెల్ప్లైన్ నంబర్ 9154970454ను సంప్రదించాలని సూచించారు.
Prajavartha Online Telugu News