-పర్యాటక ప్రాంతాలను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలి
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మిశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని పార్కులు, పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు వాటిని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మిశ సంబంధిత అధికారులను ఆదేశించారు.
విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మిశ అధ్యక్షతన టూరిజం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలు, నగరంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు వినోదాన్ని అందించే కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. విజయవాడ నగరంలోని పార్కులను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పించాలని కలెక్టర్ సూచించారు. పార్కులలో అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు, వాటిని సమర్థవంతంగా వినియోగించుకుని ఆదాయ వనరులుగా మార్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బెరం పార్క్, భవానీ ఐలాండ్, ఫెర్రీ ఘాట్ తదితర పర్యాటక ప్రాంతాల్లో ప్రతి శని, ఆదివారాల్లో ప్రజలను ఆకర్షించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మక కార్యక్రమాలు తదితరాలను నిర్వహించడం ద్వారా నగర ప్రజలతో పాటు పర్యాటకులను కూడా ఈ ప్రాంతాల వైపు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ నగరంలోని మ్యూజియం, మొగల్రాజపురంలోని గృహాలు తదితర చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఆయా ప్రాంతాల ప్రాధాన్యతను తెలియజేసే సమాచారాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు పర్యాటకులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సింగ్నగర్లో సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సిబార్ డిస్నీల్యాండ్ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని నగర ప్రజలకు వినోదం, ఆహ్లాదాన్ని అందించే ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. విజయవాడ నగర ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఖాళీ సమయాన్ని ఆనందంగా గడిపేలా పర్యాటక, వినోద ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నగరంలోని పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించి, పర్యాటకుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖలు మరియు టూరిజం కౌన్సిల్ సభ్యులు సమన్వయంతో పనిచేసి విజయవాడ నగరాన్ని మరింత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రతిపాదిత అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి, జిల్లా టూరిజం అధికారి కొల్లేటి రమేష్, టూరిజం కౌన్సిల్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News