విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ ఎల్ఐసీ కాలనీ వద్ద వైఎస్సార్సీపీ జెండా దిమ్మను అర్ధరాత్రి ధ్వంసం చేసిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న వెంటనే దేవినేని అవినాష్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.జెండా దిమ్మల దగ్గర కూడా వెన్నుపోటు పార్టీ రాజకీయం చేస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా రాజకీయ రంగు పులమడం దుర్మార్గం. వాటర్ పైప్లైన్ మరమ్మతుల కోసం వైఎస్సార్సీపీ, టీడీపీ జెండా దిమ్మలను తాత్కాలికంగా తొలగించాలని మున్సిపల్ అధికారులు సూచించారు. పైప్లైన్ పనులు పూర్తయిన తర్వాత అదే ప్రాంతంలో జెండా దిమ్మలను తిరిగి ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టంగా చెప్పారు.అయితే వైఎస్సార్సీపీ జెండా దిమ్మ ఉన్న అదే ప్రదేశంలో తిరిగి దిమ్మను ఏర్పాటు చేసుకుంటే పోలీసులు పంపించి అడ్డుకోవడం ఏంటి? వైఎస్సార్సీపీ జెండా దిమ్మను అర్ధరాత్రి పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజల మధ్య రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక చీకట్లో వైకాయి జెండా దిమ్మ పగలగొట్టే స్థాయికి దిగజారడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు.వైఎస్సార్సీపీ జెండా దిమ్మను ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.మండల అధ్యక్షుడు తుళ్లూరు ఉదయ్,5వ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News