-ఇచ్చిన హామీ నెరవేర్చిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం కలెక్టరేట్ లోని తమ చాంబర్ నందు 17 మంది మత్స్యకార బోటు యజమానులకు మత్స్యశాఖ ద్వారా రిజిస్ట్రేషన్, లైసెన్స్ పత్రాలు అందజేశారు. గత సెప్టెంబర్ మాసంలో విజయవాడలో వరద ముంపు బాధితులను రక్షించేందుకు అత్యవసరంగా బోట్లు అవసరం కాగా, జిల్లా కలెక్టర్ వెంటనే మంగినపూడి బీచ్ ఉప్పాడ పాకలు ప్రాంతం వెళ్లి మత్స్యకారులతో మాట్లాడి వారి బోట్లను లారీలలో విజయవాడ ఆఘమేఘాల మీద రవాణా చేసి వరద బాధితులను రక్షించేందుకు తోడ్పడిన విషయం విధితమే. ఈ సందర్భంగా బోటు యజమానులు తమ బోట్లకు రిజిస్ట్రేషన్, లైసెన్సు ఇప్పించాలని కలెక్టర్ ను కోరారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈరోజు బోటు యజమానులకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ పత్రాలు ఉచితంగా అందజేశారు. బోటు యజమానులు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను శాలువతో సత్కరించి మేమెంటో అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడలో వరదలు సంభవించినప్పుడు బాధితులను రక్షించేందుకు బోట్లు పంపాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ మేరకు అవసరమైన బోట్లు ఈ ప్రాంతం నుండి పంపినట్లు తెలిపారు. ఆ సందర్భంగా బోటు యజమానుల విజ్ఞప్తి మేరకు బోటు రిజిస్ట్రేషన్ లైసెన్స్ కోసం మత్స్యకారుల నుండి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా అందించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాల నిమిత్తం బోటు యజమానులు సంపూర్ణ సహాయ సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఇంచార్జ్ నాగబాబు, జిల్లా మత్స్యకారుల సహకార సంఘాల అధ్యక్షులు కొక్కిలిగడ్డ నాగ వెంకట రమేష్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News