మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడకుండా, తాగునీటి పథకాల పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ లో ఆర్డబ్ల్యూఎస్, గనులు, ఎపి విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థల ద్వారా పార్లమెంటు సభ్యుని నిధులు, సి ఎస్ ఆర్ నిధులు, డిస్టిక్ మినరల్ ఫండ్, నాబార్డ్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడకుండా తాగునీటి పథకాల పనులు, ఫిల్టర్ బెడ్ మరమత్తు పనులు వేగవంతం చేయాలని అన్నారు. సి ఎస్ ఆర్ నిధులతో చేపట్టిన పనులు బాగా ఆలస్యం అవుతున్నాయని, పనుల పురోగతి లేకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు చేపట్టిన పనులు నాణ్యతతో త్వరగా పూర్తయ్యేలా చూడాలని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలన్నారు. బిల్లులు చెల్లించకపోతే గుత్తేదారులు పనులు ఎలా చేస్తారని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. అప్పటివరకు పూర్తయిన పనుల యొక్క పార్ట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లింపుల కోసం అప్లోడ్ చేయాలని, పనులు చేసిన గుత్తేదారుల వెంటనే బిల్లులు చెల్లించాలని, చేసిన పనులకు త్వరగా బిల్లులు వస్తాయని గుత్తేదారులలో నమ్మకం కలిగించాలన్నారు. ఫిబ్రవరి ఆఖరు నాటికి చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలన్నారు. జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి నటరాజ్, ఏపీ విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఈఈ రాయన్న, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, ఏఈ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News