– అత్యవసర సమయంలో ప్రతి క్షణం కీలకమే
– సత్వర స్పందన.. ప్రభావవంతమైన చికిత్సలతో మెరుగైన ఫలితాలు
– కామినేనిలో అంతర్జాతీయ స్థాయి అత్యవసర చికిత్సా విభాగం
– ఎమర్జన్సీ చికిత్సల నిర్వహణపై అకడమిక్ సీఎంఈ ప్రోగ్రాంలో కామినేని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఆవిష్కరణల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన చికిత్సలు అందించే అవకాశం లభిస్తోందని కామినేని హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ అన్నారు. కామినేని హాస్పిటల్స్ ఎమర్జన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎమర్జన్సీ చికిత్సల నిర్వహణపై అకడమిక్ సీఎంఈ ప్రోగ్రాం నిర్వహించారు. కామినేని హాస్పిటల్స్ లో ఆదివారం జరిగిన ఈ సదస్సులో డాక్టర్ ఎన్ఆర్ఎస్ వర్ధన్ ప్రసంగిస్తూ.. అత్యవసర సమయంలో ప్రతి క్షణం కీలకమేనని, సత్వర స్పందనతో పాటు ప్రభావవంతమైన చికిత్సలను అందించడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. రోగి పరిస్థితిని కచ్చితంగా నిర్ధారించి, అవసరమైన నిపుణుల నేతృత్వంలో చికిత్సలను అందించాల్సివుంటుందని వివరించారు. వివిధ విభాగాల వైద్య నిపుణులు, సాంకేతిక సంపత్తి అందుబాటులో ఉంటే అత్యవసర పరిస్థితులను సక్రమంగా నిర్వహించవచ్చని అన్నారు. కామినేని హాస్పిటల్స్ లోని అత్యవసర చికిత్సా విభాగంలో అంతర్జాతీయ స్థాయి వైద్య పరికరాలు, అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని తెలియజేశారు. డయాగ్నస్టిక్ సర్వీసులు, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రేడియాలజీ, ఆంకాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ తదితర మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలతో కామినేని హాస్పిటల్స్ నందు అత్యున్నత ప్రమాణాలతో వైద్య చికిత్సలందిస్తున్నట్లు డాక్టర్ వర్ధన్ వెల్లడించారు. తొలుత, డాక్టర్ టి.వి. నారాయణరావు, రిటైర్డ్ ఎడిషనల్ డీఎంఈ డాక్టర్ సూర్యశ్రీ, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ఎన్ పవన్ కుమార్, సీనియర్ పర్మనాలజిస్ట్ డాక్టర్ వినతి, కామినేని క్లస్టర్ హెడ్ సునీల్ తదితర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నిర్వహణ గురించి సమగ్రంగా చర్చించారు. వ్యాధి నిర్ధారణ, పలు రకాల చికిత్సల గురించి వివిధ విభాగాల నిపుణులు విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. సంబంధిత అంశాలపై సభ్యుల సందేశాలను నివృత్తి చేశారు. కామినేని క్లస్టర్ హెడ్ సునీల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సీఎంఈ ప్రోగ్రాంకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రెండు క్రెడిట్ పాయింట్లను కేటాయించినట్లు తెలిపారు. నవీన ఆవిష్కరణలు, చికిత్సా విధానల గురించి వైద్యులకు అవగాహన పెంపొందింపజేసేందుకు కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అనేక సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. ఇటువంటి వైద్య విజ్ఞాన సదస్సుల నిర్వహణ ద్వారా ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు అవకాశం లభిస్తుందని సునీల్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News