-పవన్ కళ్యాణ్ ఆదేశాలతో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సందర్శన
-సంకురాత్రి ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలకు జనసేన మద్దతు ఉంటుందని హామీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కాకినాడ జిల్లాలో సంకురాత్రి ఫౌండేషన్ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ బృందం సందర్శించింది. ఆదివారం ఉదయం కాకినాడ సమీపంలోని ఆసుపత్రిని పరిశీలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మశ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ తో సమావేశమై సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలను, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల చంద్రశేఖర్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు, సేవలను వివవరించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరిచేందుకు పవన్ కళ్యాణ్ సహాయసహకారాలు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఓ బృందాన్ని సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ కిరణ్ ఆసుపత్రికి పంపారు. ఈ బృందం చంద్రశేఖర్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతు ఉంటుందని పవన్ కళ్యాణ్ తరఫున హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్ ను అత్యున్నత సాంకేతిక సంపత్తితో ఆధునీకరించినట్లు తెలిపిన చంద్రశేఖర్, వీలయితే ఆపరేషన్ థియేటర్ ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని పిడుగు హరిప్రసాద్ తెలియచేశారు. ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు జనసేన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
సంకురాత్రి ఫౌండేషన్ సందర్శించిన జనసేన పార్టీ బృందంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పిఠాపురం ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి నగర అధ్యక్షులు వై.శ్రీనివాస్, గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, పార్టీ నేతలు చక్రవర్తి, తలాటం సత్య, రావాడ నాగు, మోకా నాని, తుమ్మలపల్లి చందు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News