విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముత్యాలం పాడు శ్రీషిర్డీ సాయిబాబా మందిరంలో లోక కల్యాణార్థం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యాన ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. సాయిబాబా మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ శనివారం విశేషంగా 1008 లఘు గంగాళములతో పాయస నివేదన (కూడారై), 13న శ్రీ గోదా రంగనాథ స్వామివార్ల కళ్యాణం కనుల పండువగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ధనుర్మాసోత్సవాల్లో పాల్గొని శ్రీ గోదా రంగనాథస్వామి వార్లను దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలని సూచించారు. శ్రీ గోదా రంగనాథస్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధనుర్మాస మహెూత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వ్యవస్థాపక కన్వీనర్ ఎం.సత్యశ్రీహరి, పారాయణ మండలి సభ్యులు, మద్దు శ్రీనివాసరావు, మద్దు వెంకటేశ్వర్లు, ముచ్చర్ల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News