-తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హయాంలోనే హిందువులపై ముప్పేట దాడి జరిగిందని తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ అన్నారు. కూటమినేతలతో కలిసి శనివారం భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ఘటనపై రాజకీయాలు మానుకోవాలని మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు వైసీపీ నాయకులకు హితవు పలికారు. తిరుపతిలో చోటు చేసుకున్న ఘటన చాలా బాధాకరమని దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘటనను రాజకీయాలు ఆపాదించకూడదని అన్నారు. వైసీపీ హయాంలోనే అనేక దుర్ఘటనలు జరిగాయన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో రథానికి ఉన్న మూడు వెండి సింహాల ప్రతిమలు వైసీపీ హయాంలోనే దోపిడీకి గురయ్యాయి అన్నారు. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య రధాన్ని తగలబెట్టింది వైసిపి వాళ్లేనన్నారు. పిఠాపురంలో వినాయకుడు, షిరిడి సాయిబాబా విగ్రహాలతో పాటు మరెన్నో దేవత విగ్రహాలను ధ్వంసం చేశారని రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో ఆలయాలను తవ్వేశారని హుండీలు కొల్లగొట్టారని తెలిపారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఏపీ ప్రభుత్వం అందించిందని వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉందని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు జరిగిన తిరుపతి ఘటనను సాకుగా తీసుకొని అవాకులు, చవాకులు పేలితే వెలంపల్లికి , వైసిపి నాయకులకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. జగన్ ఏలుబడిలో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా హిందువులపై ముప్పేట దాడి జరిగిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కూటమినేతలు వేంపలి గౌరీ శంకర్, సప్పా శ్రీనివాస్, పల్లె పోగు బుజ్జి, భాను శ్రీరామ్, మహేష్, షేక్ నాగూర్, మద్దుల గురునాథం, రమణ తదితరులు పాల్గొన్నారు.