విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు రోడ్లపై ఆవులను వదిలిన యజమానులకు రూ. 10,000 జరిమానా విధించనున్నట్లు ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ తెలిపారు. రోడ్లపై పశువులను వదిలిపెట్టడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలగడం, ప్రమాదాలు సంభవించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించే అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ చర్యల్లో భాగంగా, ఆవులను రోడ్లపై వదిలిపెట్టకుండా నియంత్రించేందుకు అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కాటిల్ షెడ్ లో గోవుల ఆరోగ్య సంరక్షణ కోసం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.ఎస్.ఎస్. రెడ్డి పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు. ప్రజలందరూ రోడ్లపై పశువులను వదిలిపెట్టకుండా సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం, పర్యావరణం పరిరక్షణే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని అన్నారు..
Prajavartha Online Telugu News