గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని డొంక రోడ్ 3 వంతెనల వద్ద రైల్వే శాఖ చేపట్టిన నూతన ట్రాక్ ఎక్స్ టెన్షన్ పనులు ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని, ఇప్పటికే ట్రాఫిక్ రద్దీతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ రైల్వే అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ గారు తమ చాంబర్ లో రైల్వే, జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, పట్టణ ప్రణాళిక అధికారులతో పనుల పురోగతి, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గతేడాది నవంబర్ 25 నుండి డొంక రోడ్ వద్ద 3 వంతెనల మార్గంలో రైల్వే శాఖ ట్రాక్ ఎక్స్ టెన్షన్ కోసం రాకపోకలు నిలుపుదల చేశామన్నారు. ఫలితంగా అరండల్ పేట, శ్రీనగర్, గుంటూరు వారితోట, డొంక రోడ్ తదితర ప్రాంతాల ప్రజలు కొత్తపేట, బస్టాండ్ లకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. త్వరలో శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభం కానున్నందున పనులను ఫిబ్రవరి 10 నాటికి పనులు పూర్తి చేసేలా రైల్వే ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సదరు ప్రాంతంలో జిఎంసి త్రాగునీటి పైప్ లైన్ షిఫ్ట్, డ్రైన్ పనులను కూడా యుద్దప్రాతిపదికన చేపట్టాలని ఈఈని ఆదేశించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రధాన సెంటర్లలో సిబ్బందిని నియమించి ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ట్రాఫిక్ సిఐ ని ఆదేశించారు.
సమావేశంలో రైల్వే ఏడిఎన్ జగన్మోహనరావు, ఎస్ఎస్ఈ వెంకటేశ్వరరావు, జిఎంసి ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ కళ్యాణరావు, ఏసిపి రెహ్మాన్, ట్రాఫిక్ సిఐ సింగయ్య పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News