విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులు సమన్వయంతో సెపక్ తక్రా జాతీయ పాఠశాల క్రీడలను విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం అన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం సెపక్ తక్రా అండర్ ` 14 బాలురు / బాలిక జాతీయ పాఠశాల క్రీడల నిర్వహణపై అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెపక్ తక్రా జాతీయ పాఠశాల క్రీడలను ఈనెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు స్థానిక పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడలను విజయవంతం చేసేందుకు విద్యాశాఖకు చెందిన పాఠశాల హెచ్యంలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, నగర పాలక సంస్థ, పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య కమిటీ సభ్యులు సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ క్రీడలకు 12 రాష్ట్రాల నుండి క్రీడాకారులు హాజరు కానున్నారని టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని డిఆర్వో లక్ష్మీ నరసింహాం ఆదేశించారు.
అనంతరం సెపక్ తక్రా జాతీయ పాఠశాల క్రీడలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.
సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి సుబ్బారావు, స్టేట్ స్కూల్ గేమ్స్ సెక్రటరి బానుమూర్తి రాజు, డిస్టిక్ట్ స్కూల్ గేమ్స్ సెక్రటరి శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News