అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి మరియు ఉప స్పీకర్ కె. రఘు రామ కృష్ణ రాజు, వారి సతీమణి బీహార్ రాష్ట్రంలోని ప్రసిద్ధ బోధ్ గయా ప్రాంతాన్ని సందర్శించారు. ప్రపంచప్రసిద్ధ మహాబోధి ఆలయం ప్రాంగణంలో పర్యటించి, దైవిక ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. మహాబోధి ఆలయం బుద్ధిజం చరిత్రలో అత్యంత ప్రధానమైన ప్రదేశంగా భావించబడుతుంది. ఈ ప్రాంతంలోనే భగవంతుడు బుద్ధుడు బోధి వృక్షం కింద ధ్యానం చేసి జ్ఞానోదయం పొందారు. ఈ వృక్షం బుద్ధిజం ఉద్భవానికి చిహ్నంగా నిలుస్తోంది. మహాబోధి ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు బోధి వృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, శాంతి, ఆనందం కలిగించే ఆధ్యాత్మికతను అనుభవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “మహాబోధి ఆలయం వంటి ప్రదేశాలు భారత దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. ఇక్కడి వాతావరణం మనసుకు అమితానందాన్ని అందిస్తుంద”ని తెలిపారు. బోధి వృక్షం కింద కొన్ని క్షణాలు గడిపి శాంతియుతమైన ధ్యానాన్ని అనుభవించారు. మహాబోధి ఆలయం ప్రాముఖ్యతను గురించి తెలుసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ కూడా ఉన్నారు.
Prajavartha Online Telugu News