గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఇంటింటి చెత్త సేకరణ, ఖాళీ స్థల యజమానులకు నోటీసులు జారీ చేయడంలో శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారి పై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ శ్రీరామ్ నగర్, ఎన్జీఓ కాలనీ, ఏటి అగ్రహారం, సాయి నగర్, దుర్గా నగర్, కెవిపి కాలనీ, కావేరి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య పనులు, అభివృద్ధి పనులను పరిశీలించి, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రంపై ప్రజల ఫిర్యాదు మేరకు కార్యదర్శులు, ఇన్స్పెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజారోగ్య విభాగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే నూతన కాంపాక్టర్ బిన్లు, పుష్ కాట్స్ అందించామని, వెహికిల్ షెడ్ లో పారిశుధ్య పనులకు వినియోగించే వాహనాల మరమత్తులను యుద్దప్రాతిపదికన చేపట్టడానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. నగరంలో పారిశుధ్య పనుల మెరుగుదల కోసం కృషి చేస్తుంటే కొంత మంది సిబ్బంది, అధికారులు నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నారని వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారులు మరింత శ్రద్ధ చూపాలని, ఎంహెచ్ఓ, సిఎంఓహెచ్ లు రోజు ఉదయం, మధ్యాహ్నం క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. ఖాళీ స్థలాల అశుభ్రంపై ప్రజల నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని, వార్డ్ సచివాలయాల వారీగా ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి, స్పందించని స్థలాల్లో జిఎంసి బోర్డ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగర ప్రజలు కూడా గుంటూరు నగరాన్ని సుందర, శుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుకోవడానికి నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. తమ ఇంటి ముందుకు చెత్త తీసుకోవడానికి ప్రజారోగ్య కార్మికులు రాకుంటే జిఎంసి కాల్ సెంటర్ 0863-2345103 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. నగరంలో బ్లాక్ స్పాట్స్ నిషేదించామని, ప్రజలు తమ ఇళ్లల్లో వ్యర్ధాలు రోడ్లు లేదా కాల్వల్లో వేస్తె భారీ మొత్తంలో అపరాధ రుసుం విధిస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల ద్వారా పర్యవేక్షణ చేయిస్తున్నామని, సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అనంతరం కెవిపి కాలనీలోని జిఎంసి వెహికిల్ షెడ్ ని పరిశీలించి, కాలం తీరిన వాహనాలని నిర్దేశిత మార్గదర్శకాల మేరకు కండెం చేయాలని ఆదేశించారు. షెడ్ పరిసరాల్లో సిసి ఫ్లాట్ ఫారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, వాహనాలను క్రమ పద్దతిలో ఉంచడం, మరమత్తులను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశించారు.
పర్యటనలో డిఈఈ మధుసూదన్, ఏసిపి వెంకటేశ్వరరావు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News