మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగం తప్పనిసరి అని జిల్లా రవాణా శాఖ అధికారి బిఎస్ఎస్ నాయక్ అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధరరావు ఆదేశాలతో గురువారం హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేయడంపై మహిళా పోలీసులతో ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ.వి. శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ లో మచిలీపట్నం టౌన్ సర్కిల్ మహిళా పోలీసులు, శక్తి టీమ్స్, స్పెషల్ పార్టీ మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బైక్ ర్యాలీ బందర్ కోనేరు సెంటర్ నుండి ప్రారంభమై, లక్ష్మీ టాకీస్ సెంటర్, పరాసుపేట, కోటవారి తుళ్ల సెంటర్ మీదుగా తిరిగి కోనేరు సెంటర్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా మహిళా పోలీసులు ద్విచక్ర వాహనాలు నడిపిస్తూ, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, హెల్మెట్ ధరించడం ఎంత అవసరమో ప్రజలకు స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ మరియు ట్రాఫిక్ ఎస్ఐలు ఇంచార్జ్ డిటిఓ శ్రీనివాస్ నాయక్ , ఎంవిఐ సిద్దిక్ , ఏఎంవీఐ సోనీ ప్రియా తదితరులు పాల్గొన్నారు.
