-మీ దివాళాకోరు రాజకీయాలకు ఈసారి శాశ్వత సమాధే
-ఓటమిని తట్టుకోలేకే కూటమి ప్రభుత్వంపై వైసిపి అసత్య ప్రచారాలు
-వైసీపీ దుష్ప్రచారాల్ని ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకో
-సామాజిక మాధ్యమం ఎక్స్ లో జగన్పై విరుచుకుపడిన వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మీ నైజం తెలిసాక ఒకసారి నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ మళ్లీ నమ్ముతారని భ్రమపడొద్దని, ఈసారి వారిచ్చే తీర్పు ద్వారా మీ దివాళాకోరు రాజకీయలకు శాశ్వత సమాధిని కట్టడం తథ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు. ఈమేరకు మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ లో శుక్రవారంనాడు ట్వీట్ చేశారు.
అబద్ధాలను జగన్ ఆలంబనగా చేసుకుని అధికారంలోకొచ్చి “హీరో” అనిపించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్ళ పాలనలో జగన్ కేవలం అరాచకాలకు, అసత్య ప్రచారాలకు పాల్పడి “నీరో” లా వ్యవరించారని మంత్రి దుయ్యబట్టారు. మీ వ్యవహారం నచ్చక ప్రజలు మిమ్మల్ని దారుణంగా తిరస్కరించి “జీరో” చేశారని గుర్తు చేశారు. అయినా సరే ఆత్మ విమర్శ చేసుకోకుండా ‘అప్పుడప్పుడు’ ఏపీ కి వచ్చి, మళ్లీ అవే అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఫేక్ న్యూస్ తో అప్రతిష్ట తేబోయి ఆయనే అభాసుపాలవుతున్నారని మంత్రి విమర్శించారు. . ఈ సారి ప్రజలిచ్చే తీర్పు జగన్ దివాళాకోరు రాజకీయాలకు శాశ్వత సమాధి కట్టడం తధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైసిపి నాయకత్వం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ లతో అసత్య ప్రచారానికి పాల్పడుతున్న విషయాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇందుకోసం చిన్నపిల్లలను సైతం ఉపయోగించుకుని వారిని బలిపశువులు చేస్తున్నారన్నారు.
మీ హయాంలో 108 సేవలు ఎంత అధ్వానమో తెలుసా జగన్
అదే విధంగా 108 అంబులెన్స్ ల పనితీరుపై సైతం వైసిపి నాయకత్వం విషం చిమ్ముతోందంటూ ఇటీవల కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటనను మంత్రి సత్యకుమార్ ఉదహరించారు. ఆధారాలతో సహా మంత్రి బయటపెట్టారు.
కుప్పం నియోజకవర్గంలో మురుగేష్ అనే పెయింటర్ తాడు తెగి కిందపడి మరణించినట్లు వైసిపి నాయకత్వం ఒక ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసిందని, అయితే పోలీసు శాఖ దానిని ఖండించిందని మంత్రి వివరించారు. మధ్యాహ్నం 4.10 గంటలకు మురుగేష్ పెయింట్ చేస్తున్న సమయంలో తాడు తెగి కిందపడి గాయపడ్డాడని, 4.17 గంటలకు అంబులెన్స్ కు కాల్ వెళ్లిందని, 4.23 గంటలకు అంబులెన్స్ వచ్చిందని చెప్పారు. అయితే దురద్రుష్టవశాత్తూ తలకు బలమైన గాయాలు తగిలిన మురుగేష్ అప్పటికే మరణించాడన్నారు. ఈ విషయం అతడి బంధువులకు తెలియజేసినప్పటికీ వారి కోరిక మేరకు అతడిని ఆ ప్రాంత ఏరియా ఆస్పత్రికి తరలించారన్నారు. ఇవన్నీ కాల్ రికార్డు, వీడియో రికార్డు రూపంలో నమోదై వున్నాయన్నారు. అయినప్పటికీ అసత్య ప్రచారాన్ని వైసిపి నాయకత్వం కొనసాగిస్తుండటం మంచిదికాదన్నారు. వైసిపి హయాంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ ల్లో 190 వాహనాలు పనిచేయని స్థితిలో వుంటే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చొరవతొ ప్రభుత్వం కొత్త వాహనాల్ని కొనుగోలు చేసిందని వివరించారు. వైసిపి సర్కారు హయాంలో కంటే కూటమి ప్రభుత్వ హయాంలోనే 108 అంబులెన్స్ ల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని మంత్రి గణాంకాలతో సహా వివరించారు. అనేక ఒత్తిడుల మధ్య విధులు నిర్వహించే 108 ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని అసత్య ప్రచారంతో దెబ్బతీయవద్దని, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించవద్దని మంత్రి సత్యకుమార్ సూచించారు.
Prajavartha Online Telugu News