-మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో నిర్వహించిన పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం తృతీయ స్థానంలో నిలవడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయలను చాటిచెప్పేలా రూపొందించిన ఏటికొప్పాక బొమ్మల శకటం దేశ ప్రజలతో పాటు ప్రధాని నరేంద్రమోడిని సైతం ఆకట్టుకుందన్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ హస్తకళాకారుల ప్రతిభ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. సహజ సిద్ధమైన వనరులతో పర్యావరణహితంగా ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తుంటారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే హస్త కళలకు ప్రాధాన్యమిస్తోందన్నారు. రాష్ట్రంలో హస్త కళాకారులకు ఆర్థిక చేయూతనందిస్తూ, పలు ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోందన్నారు. చేనేత వస్త్రాలతో కలిపి హస్తకళల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పిస్తోందన్నారు. ఏటికొప్పాక బొమ్మల శకటం దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతో ఆ కళకు మరింత ఊతం లభించే అవకాశముందన్నారు. ఏటికొప్పాక బొమ్మల శకటం రూపొదించి, ఢిల్లీ పేరెడ్ లో ప్రదర్శించిన బృందానికి మంత్రి సవిత ఆ ప్రకటనలో అభినందనలు తెలిపారు.