-టెలిపోన్ భవన్ లో టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశం
-టి.ఎ.సి చైర్మన్ గా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తొలి సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బి.ఎస్.ఎన్.ఎల్ ద్వారా ప్రజలకు మెరుగైన టెలికాం సేవలను అందించేందుకు, పూర్వ వైభవం తీసుకురావటానికి సమిష్టిగా కలిసి కృషి చేద్దామని ఎన్టీఆర్ జిల్లా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్ చెప్పారు. చుట్టుగుంటలోని బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం ఎన్టీఆర్ జిల్లా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ 2024-26 సెషన్ మొదటి సమావేశం జరిగింది. టి.ఎ.సి చైర్మన్ గా తొలిసారి బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కి బి.ఎస్.ఎన్.ఎల్ విజయవాడ బిజినెస్ ఏరియా జనరల్ మేనేజర్ కే. మురళీకృష్ణ ఐ.టి.ఎస్ తో పాటు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ ఏపీ సీజీఎం ఎం.శేషాచలం ను మర్యాదపూర్వకం గా కలిశారు.
అనంతరం టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ బి.ఎస్.ఎన్.ఎల్. కు ప్రజలకు అనుసంధానంగా వ్యహరిస్తానన్నారు. త్వరలో బి.ఎస్.ఎన్.ఎల్. 5జి సేవలను విస్తరించాలని, అలాగే విజయవాడ బిజినెస్ ఏరియా ఆంధ్రప్రదేశ్ లోనే అగ్రగామి గా మంచి లాభాలతో వెళ్లాలని సూచించారు. బి.ఎస్.ఎన్.ఎల్. అభివృద్ధి లో భాగంగా తనవంతు సహాయసహకారాలు అందజేయటానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానని తెలియజేసారు.
అనంతరం బి.ఎస్.ఎన్.ఎల్. జి.ఎమ్. కె.మురళీ కృష్ణ మాట్లాడుతూ విజయవాడ బి.ఎస్.ఎన్.ఎల్. కు సంబంధించిన ప్రగతి తో పాటు భవిష్యత్తు ప్రణాళికలు తెలియజేశారు. త్వరలోనే బి.ఎస్.ఎన్.ఎల్. విజయవాడ బిజినెస్ ఏరియా లోని అన్ని టవర్లను 4జి లోనికి మార్చి ఆ తర్వాత 5జి సేవలను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. బి.ఎస్.ఎన్.ఎల్. ఎప్.టి.టి.హెచ్ ఫైబర్ నెట్ సేవలలో ఎంతో అభివృద్ధి సాధించిందని, త్వరలోనే ఆధునికమైన MAAN ఎక్విప్మెంట్ ఉపయోగించి మరింత వేగవంతమైన ఇంటర్నెట్ ను బి.ఎస్.ఎన్.ఎల్.. వినియోగదారులకు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి.ఎస్.ఎన్.ఎల్. విజయవాడ లోని వివిధ శాఖలకు చెందిన డి.జి.ఎమ్ లు, ఎ.జి.ఎమ్ లు, సి.ఎ.వో లతో పాటు ఎస్.డి.ఈ లు పాల్గొన్నారు.