-సుజనా ఫౌండేషన్ చొరవతో నైపుణ్యాభివృద్ధి..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో చిత్రలేఖనం శిక్షణా తరగతులను శనివారం ప్రారంభించారు.
ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి, సుజనా ఫౌండేషన్ సభ్యులు పాల్గొని చిత్రలేఖనం తరగతులను ప్రారంభించారు. తెలిసి తెలియక చేసిన తప్పులకు జువైనల్ హోమ్ లో ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సుజనా ఫౌండేషన్ ద్వారా చిత్రలేఖనంలో శిక్షణనివ్వడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి జువైనల్ హోంను పరిశీలించారు. సుజనా ఫౌండేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు.
సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ హోమ్ లోని బాలురకు వాలీబాల్, క్యారమ్స్, చెస్ వంటి ఆటలలో ప్రోత్సహిస్తున్నామన్నారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం తరగతులను కూడ ప్రారంభించడం ద్వారా చిన్నారులలో మనోవికాసం కలుగుతుందని తెలిపారు. చిత్రలేఖనం శిక్షణ అనంతరం ప్రత్యేక పోటీలను నిర్వహించి వారికి సర్టిఫికెట్స్ ను అందజేస్తామని తెలిపారు. సుజనా చౌదరి ఆదేశాల మేరకు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలురకు చిత్రలేఖనం తరగతులను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. వారిలో నైపుణ్య శిక్షణను మెరుగుపరచడం ద్వారా భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను పెంపొందించవచ్చని తెలిపారు. ఇన్ టేక్ ప్రోబెషన్ ఆఫీసర్ హాసన్ అలిబేగ్, ఎన్డీయే కూటమి నేతలు సముద్రాల ప్రసాద్, కోగంటి రామారావు, వేంపలి గౌరీ శంకర్, భాను, డ్రాయింగ్ టీచర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News