మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
ఏ అనాథ బిడ్డ తల్లిదండ్రులు, కుటుంబం లేకుండా ఉండకూడదు అని, అలాంటి పిల్లలకు కొత్త జీవితాన్ని అందించేందుకు సహృదయులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కలెక్టరేట్ లోని తన చాంబర్లో శిశు గృహ మచిలీపట్నంలో ఉంటున్న బాలుడిని కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) ద్వారా జిల్లా బాలల రక్షణ విభాగం (డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వాసులు నోటం రవి, ఉషా దంపతులకు దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలుడితో సరదాగా సంభాషించారు. నీ పేరు ఏమిటి.. ఏం చదువుకుంటున్నావని ఆయన బాలుడిని అడగ్గా, నా పేరు చరణ్.. అంగన్వాడీ బడిలో చదువుకుంటున్నానని సమాధానం ఇచ్చాడు. బాలుడుని బాగా చూసుకొని, మంచిగా చదివించాలని దత్తత తీసుకున్న జంటకు సూచించారు. బాలుడిని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి ఎం ఎన్ రాణి, డిసిపిఓ మోనిషా, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ సువార్త, పిఓ ప్రశాంతి, ఈవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News