-ప్రతి మహిళా పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలి.
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదాయ సృష్టి ఆర్థిక స్వాలంబనతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగటంతో పాటు పదిమందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గొల్లపూడిలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన స్వయం సహాయక బృందాల జిల్లా సమాఖ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పేదరికాన్ని రూపుమాపేందుకు, మహిళలను ఆర్థికసాధికారత దిశగా నడిపించి వారు స్వయం సమృద్ధిని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్వయం సహాయక బృందాల మహిళలు కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు వీలుగా ఆర్ధికంగా ఎదిగేందుకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకొనేలా మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలు స్వయం ఉపాధి కల్పించేలా స్వయం సహాయక సంఘాల మండల జిల్లా సమాఖ్య సభ్యులకు చేతివృత్తులలో శిక్షణ అందించడంతో పాటు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, స్టాండప్ ఇండియా తదితరాలను ఉపయోగించుకొని ఆసక్తి ఉన్న యూనిట్ను ఏర్పాటుచేసి క్రమశిక్షణతో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 10 వేల యూనిట్ల ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నామని.. వీటిలో దాదాపు 5 వేల యూనిట్లు సెర్ప్-డీఆర్డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ఏర్పాటు జరిగేలా మహిళలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. బ్యాంకు రుణాలు పొందే విధానం, వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించుకోవడం శిక్షణ ఇవ్వడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదుగి మహిళా శక్తిని నిరూపించుకొవాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
సమావేశంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కల్పన, ఎన్ఐఆర్డీ ప్రతినిధి మురళి, మండల జిల్లా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News