-సచివాలయంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 11 వ తేదీ మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరుగునున్న కార్యదర్శుల సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశ నిర్వహణకు రాష్ట్ర సచివాలయంలో చేస్తున్న ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖలకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎటు వంటి లోపాలకు తావులేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రొటోకాల్ ప్రకారం అందరికీ సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, ఆయా శాఖల మంత్రులకు అందుబాటులో సంబందిత కార్యదర్శులు ఉండే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులు వారి శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో పాటు భవిష్యత్ ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా ఈ సమావేశంలో వివరించే అవకాశం ఉన్నందున సమావేశ మందిరంలోని అన్ని టీవిలు, మైక్ లు చక్కగా పనిచేసేలా చూడాలన్నారు. సమావేశ మందిరంలో ఎటు వంటి విద్యుత్ అంతరాయం లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశానికి హాజరయ్యే ప్రముఖులు అందరికీ స్వాగతం పలికేలా ప్లక్స్ బ్యానర్లు, సమావేశం వివరాలను తెలిపే బ్యాక్ డ్రాప్ లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా సమావేశం జరిగే మందిరాన్ని రకారకాల పూల కుండీలతో అందంగా అలంకరించాలన్నారు. సమావేశానికి సహాజరయ్యే ప్రముఖులు అందరికీ ఎక్కడ ఏ విధంగా భోజనాల ఏర్పాట్లు చేయాలి, సమావేశం జరిగే సమయంలో కాఫీ, టీ, స్నాక్స్ ను ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశాలపై అధికారులకు ఆయన స్పష్టమైన సూచనలు చేశారు.
సాధారణ పరిపాలనా శాఖ ప్రొటోకాల్ డైరెక్టర్ టి.మోహన్ తో పాటు ఐ.టి., ఐ&పిఆర్ శాఖలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.