అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరతాయి. ఢిల్లీ అభివృద్ధికీ, దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయి. నరేంద్ర మోదీ పై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారు. కేంద్ర హోమ్ శాఖామాత్యులు శ్రీ అమిత్ షా గారు దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకొన్నారు. ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులయ్యారు.
ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో విజయానికి మూల కారకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, అమిత్ షా కి, జె.పి.నడ్డా కి, బీజేపీ, మిత్ర పక్ష నాయకులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News