-బహిరంగ వేలంలో కిలో ఒక్కింటికి రూ.22 /- చొప్పున ధర నిర్ణయం
-జేసీ చిన్న రాముడు
రాజమహేంద్రవరం / గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
*తూర్పు గోదావరి జిల్లాలో సీజ్ చేసి నిల్వ ఉన్న 47.274 పీడీఎస్ రైస్ ను ఫిబ్రవరి 14 న ఉదయం గోపాలపురం , అదే విధంగా 16.00 మెట్రిక్ టన్నుల పిడిఎస్ రైస్ ఫిబ్రవరి 14 న దేవరపల్లి లో బహిరంగ వేలం వేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వివిధ 6ఎ కేసులలో సీజ్ చేయబడిన 47.274 మెట్రిక్ టన్నుల పిడిఎస్ రైస్ (ప్రజా పంపిణీ బియ్యాన్ని) గోపాలపురం యం.యల్.యస్ పాయింట్ నందు నిల్వ చేయడం జరిగిందన్నారు. ఈ మొత్తాన్ని ఫిబ్రవరి 14 ఉదయం 11.00 గంటలకి గోపాలపురం ఎం ఎల్ ఎస్ పాయింట్ వద్ద వేలం వేస్తామని తెలిపారు.
అదేవిధంగా 16.00 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని శ్రీవేంకటేశ్వర రైస్ మిల్లు, దేవరపల్లి లో విచారణ అనంతరం 6ఎ కేసు నేపథ్యంలో సీజ్ చేయడం జరిగిందన్నారు. సీజ్ చేయబడిన ప్రజా పంపిణీ బియ్యాన్ని ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 1.00 గంటకు దేవరపల్లి , శ్రీవేంకటేశ్వర రైస్ మిల్లు వద్ద వేలం వేయనున్నట్లు తెలిపారు.
కిలో ఒక్కింటికి రూ.22 /- చొప్పున ధర నిర్ణయించి బహిరంగ వేలం ద్వారా అమ్మకానికి ఉంచడం జరిగిందని తెలిపారు. ఫిబ్రవరి 14 వ తేదీ ఉదయం 11.00 గంటలకు గోపాలపురం ఎం ఎల్ ఎస్ పాయింట్ వద్ద , మ.1.00 గంటకు దేవరపల్లి శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లు లో బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వ్యాపారస్తులు జీఎస్టీ లైసెన్స్ కలిగి ముందుగా రూ.5,000/- ధరావత్తు సొమ్మును చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలంలో హెచ్చు పాటదారునికి సరుకును అప్పగించడం జరుగుతుందన్నారు. వేలం పాట వాయిదా వేయుట, నిలుపుదల చేయుట, పూర్తిగా రద్దు చేయుటకు జిల్లా యంత్రాంగానికి అధికారాలు ఉన్నాయని ఆ ప్రకటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు తెలిపారు. వేలం పాట నిర్వహించే గోపాలపురం, దేవరపల్లి ప్రదేశాల్లో పౌర సరఫరాల సిబ్బందిని సంప్రదించి ధరావత్తు సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వేలం జరిగే రోజున కూడా ముందుగా ధరావత్తు సొమ్మును చెల్లించే అవకాశం ఉంటుందని తెలిపారు.
Prajavartha Online Telugu News