– శిశు ఆధార్పైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలి
– ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలి
– ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అయిదేళ్లకు పైబడిన పాఠశాల విద్యార్థులు, 15 ఏళ్లకు పైబడిన ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ కళాశాలల విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేయించాల్సి ఉంటుందని, ఇందుకు ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ (డీఎల్ఏఎంసీ) సమావేశం జరిగింది. రెవెన్యూ, విద్య, వైద్య ఆరోగ్యం, ఐసీడీఎస్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు సమావేశంలో నేరుగా పాల్గొనగా యూఐడీఏఐ రీజనల్ కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్ జి.గిరిధర్ వర్చువల్గా హాజరయ్యారు. జిల్లాలో ఆధార్ నమోదు స్థితిగతులు, ఆధార్ కేంద్రాల పనితీరు, ఆధార్ నమోదుకు ధ్రువీకరణ పెండెన్సీ, శిశు ఆధార్ తదితరాలపై చర్చించారు. అయిదేళ్లకు పైబడిన, 15 ఏళ్లకు పైబడిన విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు హాజరైన సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని తెలిపారు. మ్యాన్యువల్ రెసిడెన్స్ సర్టిఫికేట్కాకుండా ఇంటిగ్రేటెడ్/జనన/కమ్యూనిటీ/నేటివిటీ సర్టిఫికేట్ ద్వారా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలన్నారు. ఈ విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే ఆధార్ రిజిస్ట్రేషన్కు చర్యలు తీసుకోవాలని.. ఈ విషయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆధార్ నమోదుకు జనన ధ్రువీకరణ సర్టిఫికేట్ అవసరం కాబట్టి త్వరితగతిన సర్టిఫికెట్ జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. బర్త్ సర్టిఫికేట్ లేని చిన్నారులను గుర్తించి, బర్త్ రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అంగన్వాడీ కార్యకర్తలు కృషిచేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు పారదర్శక, దోషరహిత ఆధార్ విషయంలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో జిల్లాస్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ కన్వీనర్, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీసీపీ కేజీవీ సరిత, డీఈవో యూవీ సుబ్బారావు, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, ఎల్డీఎం కె.ప్రియాంక
విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News