Breaking News

బాధ‌లున్నా… బ‌కాయిలు చెల్లింపు

-రూ.22,507 కోట్ల పాత బ‌కాయిలు చెల్లించాం
-ఇది ఈ ప్ర‌భుత్వ నిబ‌ద్ద‌త
-ఉద్యోగుల‌కు ఒక‌టో తేదీన జీతాలివ్వాల్సిందే
-త్వ‌ర‌లోనే మెగా డీఎస్సీ
-ఆర్థిక శాఖపై స‌మీక్ష‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
గ‌త ప్ర‌భుత్వం వ‌ల్ల ఏర్ప‌డ్డ న‌ష్టాలు వెంటాడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు, బాధ‌లున్న‌ప్ప‌టికీ కూడా కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఈ ఎనిమిది నెల‌ల్లోనే రూ.22,507 కోట్ల పాత బ‌కాయిల‌ను చెల్లించ‌గ‌లిగింద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ఇది ఈ ప్ర‌భుత్వ నిబద్ద‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. చాలా క్లిష్ట ప‌రిస్థితుల్లో ఈ ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌ని, ఎన్నో స‌వాళ్లు ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని, అయిన‌ప్ప‌టికీ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పాత బ‌కాయిల‌ను కూడా తీర్చ‌గ‌లిగేలా ఆర్థిక శాఖ ప‌నిచేయ‌డం సంతోష‌దాయ‌క‌మ‌ని ఆ శాఖ అధికారుల‌ను ప్ర‌శంసించారు. మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో ఆ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్ ఇచ్చిన ప్ర‌జంటేష‌న్‌పైన సీఎం స్పందించారు. గ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్ల ఇంకా చెల్లించాల్సి పాత బ‌కాయిలు చాలా ఉన్నాయ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన ప‌నికి ఆ ఇబ్బందులు ఇప్ప‌టికీ మ‌న‌ల్ని వెంటాడుత‌న్నాయి, అయిన‌ప్ప‌టికీ మ‌నం ఇంకా మ‌న ప‌నితీరు పెంచుకుని వాటిని అధిగ‌మించాల‌న్నారు. ఇన్ని ఇబ్బందుల్లోనూ మ‌నం ప్ర‌తి నెలా ఒక‌టో తేదీనే ఉద్యోగుల‌కు జీతాలు, పింఛ‌న్లు చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. భవిష్య‌త్తులోనూ ఎన్ని క‌ష్టాలున్నా స‌రే, ఉద్యోగులకు ఒక‌టో తేదీన జీతాలు, పింఛ‌న్లు చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.
కేంద్ర స‌హ‌కారంత అమ‌రావ‌తి, పోల‌వ‌రం లాంటి ప‌నులు కూడా చేపడుతున్నామ‌ని, క్యాపిట‌ల్ ఎక్స్‌పిండిచ‌ర్ కింద‌, నీటిపారుద‌ల‌, ర‌హ‌దారులు త‌దిత‌ర ప‌నుల‌కు సంబంధించిన బిల్లులు క్లియ‌ర్ చేశామ‌న్నారు.

త్వ‌ర‌లోనే డీఎస్సీ నిర్వ‌హిస్తాం
త్వ‌ర‌లోనే డీఎస్సీ నిర్వ‌హించి ఉద్యోగ నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు రావాల్సిన నిధులు ఎంత‌మేర రాబ‌ట్ట‌గ‌లుగుతామో ఆ మేర రాబ‌ట్టేలా ప‌ని చేయాల‌న్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిస్థాయిలో గాఢిలో ప‌డాలంటే మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

వేత‌నాల‌కు రూ.85 వేల‌ కోట్లు
ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం ఒక‌టో తేదీనే ఉద్యోగుల‌కు వేత‌నాలు, పింఛ‌న్లు చెల్లిస్తున్నామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌ద్దు కింద రూ.85,445 కోట్లు చెల్లించామ‌ని ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ‌, ఎన్టీఆర్ భ‌రోసా, దీపం 2.0 ప‌థ‌కాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రూ.31,613 కోట్లు ఖ‌ర్చు చేశామ‌న్నారు. స్థానిక సంస్థ‌ల బ‌లోపేతం కొర‌కు పంచాయ‌తీల‌కు రూ.2,488 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మొత్తం 95 సెంట్ర‌ల్ స్పాన్స‌ర్డ్ ప‌థ‌కాల్లో 74 ప‌థ‌కాల‌ను రివైవ్ చేశామ‌ని వెల్ల‌డించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జనాభా గణన 2027లో వివరాలు నమోదు ప్రతి పౌరుని కనీస భాధ్యత…

-గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *