-వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిర్మిస్తున్న చర్చి పనులపై
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మంగళవారం ఉదయం గుణదల మేరీ మాత చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ 101వ గుణదల మేరీమాత ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గత మూడు రోజులుగా మేరిమాతను లక్షలాది మంది భక్తులు వచ్చి వారి కోర్కెలను మేరీమాతకు విన్నవించుకున్నారన్నారు. ఒక వైపు కనకదుర్గమ్మ, మరో వైపున మేరీమాత విజయవాడ నగరాన్ని కాపాడుతున్నారన్నారు. మేరీమాతను దర్శించుకున్న వారి జన్మ దన్యమైందనే భావనలో భక్తులు ఉన్నారన్నారు. మేరిమాత ఆలయానికి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్చి నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి సహకారాన్ని అందిస్తారని చెప్పారు. ఈ చర్చి నిర్మాణంపై ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గతంలో ఇబ్బంది వచ్చిన సమయంలో తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని, దర్గాతో పాటుగా గుణదలలోని ఈ మేరీమాతను కూడా దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేగా ఈ మేరిమాత ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు.
ఈ కార్యక్రమములో నందిపాటి దేవానంద్, తాడి బాబూరావు, దాసరి గాబ్రియేలు, పడాల గంగాధర్, సుగసాని కృష్ణ ప్రసాద్, షేక్ షరీఫ్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News