-షష్ట షణ్ముఖ ఆలయాల యాత్రలో భాగంగా స్వామి ఆశీస్సులు తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-సంప్రదాయ బద్ధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికిన ఆలయ అధికారులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యుద్ధం – విజయానికి వేదిక అయిన బంగాళాఖాతం తీరంలో వెలిసిన తిరుచెందురు శ్రీ ఆర్ములిగ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా షష్ట షణ్ముఖ క్షేత్రాల సందర్శనలో గురువారం తిరుచెందురులోని ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయాన్ని దర్శించారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన తనయుడు అకిరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఆర్. అరుమురుగన్ టక్కర్, ఆలయ జాయింట్ కమిషనర్ జ్ఞాన శైలరాన్ తోపాటు ఆలయ పండితులు పవన్ కళ్యాణ్ కి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ ప్రవేశం చేశారు. స్కంద పురాణంలో సముద్రంలో దాగి ఉన్న సురపద్మన్ అనే రాక్షసుడు సంహారం కోసం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ తీరానికి వచ్చి రాక్షస సంహారం చేసి ఇక్కడ విజయనాదం చేసినట్లు పురాణ గాధలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని విజయానికి ప్రతీకగా భావించి శ్రీ మురుగన్ ను భక్తులు కొలుస్తారు. 1646- 48 మధ్యకాలంలో కూడా పోర్చుగీసు వారి వద్ద నుంచి ఇక్కడున్న స్థావరాన్ని స్వాధీనం చేసుకుని డచ్ వారు తిరుచెందురు దేవస్థానం నిర్వహణను తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావించినపుడు, స్థానికులంతా తిరుగుబాటు చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి రక్షణగా నిలిచారు. నిత్యం వేలాదిమంది భక్తులతో సముద్ర తీర ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. పవన్ కళ్యాణ్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకొని, ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ విశేషాలను, నిర్వహణను భక్తులకు అందుతున్న సౌకర్యాలను కూడా ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మొక్కులను సాంప్రదాయం ప్రకారం చెల్లించుకున్నారు.
దేశానికి, ప్రజలకు మంచి చేయాలి
తిరుచెందురు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ యాత్ర పూర్తిగా ఆధ్యాత్మికపరమైనది. రాజకీయాలకు సంబంధం లేదు. హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడే ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ప్రజలకు దేశానికి మంచి జరగాలి అన్నదే నా అభిలాష. రాజకీయాలు ప్రజా క్షేమం కోసం ఉపయోగపడాలి. తమిళనాడు ప్రజలు పూర్తి సుఖసంతోషాలతో ఉండాలని నా ఆకాంక్ష. దేశ ప్రజలందరికీ తగిన ఆయురారోగ్యాలు అందించాలని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని వేడుకున్నాను. దేశం బాగుండాలని కాంక్షించాను” అన్నారు.
Prajavartha Online Telugu News