గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్ధికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని, అందులో భాగంగా మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి ఉత్పత్తులను ఈ-కామర్స్ ప్లాట్ ఫారం లో ఒకే రోజు లక్ష ఉత్పత్తులను అమ్మకం చేయడం ద్వారా గిన్నీస్ రికార్డ్ సాధించడానికి ఆర్.పి.లు గుంటూరు నగరంలో సభ్యులను భాగస్వాములను చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మెప్మా సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మెప్మా సిఎంఎంలు, సిఓలు, ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయం సహాయక సంఘాల సభ్యులు తాము ఉత్పత్తి చేసిన ఉత్పత్తులను ఆన్ లైన్ ఈ-కామర్స్ ద్వారా ఒకే రోజు లక్ష ఉత్పత్తులను అమ్మకం చేయడం ద్వారా షుమారు రూ.1 కోటి ఆదాయం సభ్యులకు అందేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఈ నెల 16 నుండి ఉత్పత్తుల కొనుగోలుకు ఆర్డర్లను ప్రీబుకింగ్ ఆప్షన్ ఇవ్వబడుతుందన్నారు. గుంటూరు నగర అభివృద్ధిలో రాబోయే కాలంలో స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా జరిగే ఈ కామర్స్ అమ్మకాల్లో గుంటూరు నగరంలోనే లక్ష మందితో ఉత్పత్తులు అమ్మకం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, మెప్మా పిడి విజయలక్ష్మీ, ఉపా సెల్ పిడి రామారావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News