గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలో అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలోనే ఎమినిటి కార్యదర్శులు, ఏఈలు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ తమ రోజువారీ పర్యటనలో భాగంగా కెవిపి కాలనీ, నల్లచెరువు, శ్రీనివాసరావు తోట, హనుమాన్ నగర్, ముత్యలరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ అభివృద్ధి పనులైన రోడ్లు, డ్రైన్లు నిర్మాణ సమయాల్లోనే స్థానిక వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి పనులను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపాలను గుర్తిస్తే సంబందిత కార్యదర్శులు, ఏఈలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఇళ్ల మధ్యల్లో ఖాళీ స్థలాలు వలన చుట్టు పక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలు ఫిర్యాదులు అందిస్తున్నారని, శానిటేషన్ కార్యదర్శులు ఆయా స్థల యజమానులకు శుభ్రం చేసుకోవాలని నోటీసులు ఇవ్వాలని, స్పందించని వారి స్థలాల్లో జిఎంసి బోర్డ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సచివాలయం పరిధిలోని ప్రతి వ్యాపార, వాణిజ్య సంస్థ డి&ఓ ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలని, లేని వాటికీ వెంటనే దరఖాస్తు చేయించాలన్నారు. రోడ్ల పక్కన అనధికార క్రయ విక్రయ దుకాణాలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు.
పర్యటనలో డిఈఈ మధుసూదన్, ఏసిపి మల్లిఖార్జున, ఆర్ఓ రవికిరణ్ రెడ్డి, ఎస్ఎస్ ఆనంద కుమార్, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News