-వచ్చే 5 ఏళ్లలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టభద్రులంతా ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని టిడిపి నాయకులకు గద్దె క్రాంతి కుమార్ కోరారు. సోమవారం ఉదయం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ పార్కు, ఎల్.ఐ.సి కాలనీ నెల్సన్ మండేలా పార్కులలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె క్రాంతికుమార్ స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని కలిసి ఓటు వేసే విధానాన్ని వివరిస్తూ వారి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు పక్కన ఒకటి అంకెను వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో నిరుద్యోగ యువతీ యువకులకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్లుగానే శాసనమండలి లోను మెజార్టీ ఉండేలా కూటమి బలపరిచిన ఎమ్మెల్సీలను గెలిపించుకొని పెద్దల సభలో కూటమి బలం పెంచాలని అన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ విద్యావంతుడు, న్యాయవాది కాబట్టి పట్టభద్రుల సమస్యలపై అవగాహన కలవారని అటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో పట్టభద్రుల తరుపున పోరాటం చేయడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ఒప్పించి సమస్యలు పరిష్కరించగలరు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, గొల్లపూడి నాగేశ్వరరావు, జాస్తి కృష్ణారావు, దాసరి గాబ్రియేలు, స్వర్ణ ఆంజనేయులు, సాంబిరెడ్డి, శ్రీనివాస్, దండమూడి సన్నిధి, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News