-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ పై అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి కుటుంబంలో ఒకరు ఎంటర్ ప్రెన్యూర్ గా తయారై ఆర్థిక స్వాలంబన సాధించాలనే లక్ష్యంతో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పని చేస్తున్నారు. ఇందుకోసం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME) ద్వారా లోన్స్ తీసుకుని మధ్య తరగతి ప్రజలు పారిశ్రామికవేత్తలు గా ఏ విధంగా తయారు కావచ్చో సామాన్య జనాలకు అర్థమయ్యే విధంగా డివిజన్స్ వారీగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.
మంగళవారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాలపై 47వ డివిజన్ లోని కుండల మార్కెట్ దగ్గర గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ పై ప్రజల్లో మరింతగా అవగాహన పెంచి వినియోగించుకునేందుకు టిడిపి పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో టిడిపి నాయకులు మాట్లాడుతూ ఎమ్.ఎస్.ఎమ్. ద్వారా స్వయం ఉపాధి పరిశ్రమ కు ఏర్పాటు చేసుకునేందుకు లక్ష రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు సబ్సిడీ తో కూడిన లోన్ వస్తుందని తెలిపారు. అలాగే మహిళలకు 45 శాతం సబ్సిడీ వుంటుందని వివరించారు.
ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వివరించి చెప్పటంతో పాటు , ప్రజలు లోన్ కోసం దరఖాస్తు చేసుకునే దగ్గర నుంచి పారిశ్రామికవేత్తలుగా మారటానికి బ్యాంక్ నుంచి లోన్స్ అందుకునే వరకు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పూర్తి సహాయ సహకారాలు అందజేస్తారని తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాగోతి రామారావు, కార్యదర్శి ఎమ్.రాజు, ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ సంకే విశ్వనాథం, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాహ్, టిడిపి రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు ఆషా, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాధం, మాజీ కార్పొరేటర్ కాకు మల్లిఖార్జున యాదవ్, టిడిపి నాయకులు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News