గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలోని విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కమీషనర్ తమ రోజు వారీ పర్యటనలో భాగంగా బుడంపాడు, బొంతపాడులోని పలు ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, విలీన గ్రామాల్లో రోడ్లు, త్రాగునీటి వసతి, మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వార్డ్ సచివాలయ కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలపై సమగ్ర అవగాహన కల్గి ఉండి అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులకు నివేదిక అందించాలని ఆదేశించారు. అలాగే ప్రజారోగ్య కార్మికుల రేషనలైజేషన్ పూర్తి అవుతున్నందున పారిశుధ్య పనుల్లో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా పర్యవేక్షణ చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్లకు స్పష్టం చేశారు. పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ సతేష్ కుమార్, ఎ.ఈ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News