-మందుల సరఫరా దారులకు మీరు పెట్టిన రూ.1000 కోట్ల బకాయిల్ని మేము చెల్లించాం
-మాజీ సిఎం జగన్ కు వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వంపై అసత్యప్రచారం మానుకుని ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని బాధ్యతగా వ్యవహరించాలని మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ హితవు పలికారు. వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్రకు వెళ్లినట్టుంది వైఎస్ ఆర్ సిపి నేత జగన్ రెడ్డి వ్యవహారశైలి వుందని మంత్రి
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్ పై ధ్వజమెత్తారు. మీ ప్రభుత్వం మందుల సరఫరాదారులకు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు పెట్టి వెళితే కూటమి ప్రభుత్వం చెల్లించిందన్న విషయం తెలీదా అంటూ ఆయన జగన్ ను ప్రశ్నించారు. బకాయిలు పెట్టి, మందుల సరఫరాను ఆపి, పేదల ఆరోగ్యంతో ఆడుకున్నది వైఎస్ ఆర్ పార్టీ.. ప్రభుత్వమేనని మంత్రి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం కమిషన్లకు పరిమితమైతే, అప్పులు చెల్లించి, పరిస్థితుల్ని చక్కదిద్ది ఇవాళ సంక్రమంగా మందుల్ని సరఫరా చేసి పేదల్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందని తెలిపారు. ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి లేనందునే ప్రజలు జగన్ పార్టీని దారుణంగా తిరస్కరించారని, అయినా కూడా వైసిపి నేతలకు బుద్ధి రాలేదని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ అసత్య ప్రచారాలు మానుకుని ప్రజలు అలాంటి తీర్పు ఎందుకిచ్చారో ఆత్మ విమర్శ చేసుకోవాలని, భాద్యతాయుతంగా నడుచుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
అసత్య ప్రచారాలు మానుకోకపోతే అసెంబ్లీలోకి 11 కు బదులు ఒకటే రావడం ఖాయం
చిన్న పిల్లలతో ఆడించిన “అమ్మ ఒడి – నాన్న బుడ్డీ నాటకం” బట్టబయలు కావడంతో అభాసుపాలయ్యి పొట్ట ఉబ్బరంతో వైసిపి నాయకత్వానికి గ్యాస్ ఎక్కువైనట్లుందని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని మింగి అజీర్తి చేస్తే ప్రజలు తొమ్మిది నెలల క్రితం వారికి 11 గ్యాస్ మందులిచ్చి వదిలించారన్నారు. పేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి అసత్య ప్రచారాలను కొనసాగిస్తే అసెంబ్లీలో వారి బలం 1 కి పడిపోయే ప్రమాదం ఉందంటూ జాగ్రత్త పడాలని హితవు పలికారు.
Prajavartha Online Telugu News