-మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు
-వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో టమాటా ధరల పతనంపై ప్రభుత్వం తక్షణ చర్యలకు ఆదేశించింది. రాష్ట్రంలో టమాటాను రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మంత్రి అచ్చెన్నాయుడు మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత, సంబంధిత జిల్లాల జాయింట్ కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మార్కెటింగ్ శాఖ రైతుల నుంచి రేపటి నుంచి (21.02.25)టమాట కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లులో నేరుగా విక్రయించాలని, పొరుగు రాష్ట్రాలకు అవసరం మేరకు ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వంలో పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే రవాణా సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా జిల్లాల మార్కెటింగ్ అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్లు, రైతు బజార్ల అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగు దశ నుంచి మార్కెటింగ్ దశ వరకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. టమాటా కొనుగోళ్లకు అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించాలని, పరిస్థితి తనకు నేరుగా ఎప్పటికప్పుడు తెలియచేయాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News