జగన్ కు మంత్రి సవిత హితబోధ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిపక్ష హోదా ఎవరిస్తారో నీకు తెలీదా..? అధికారంలో 30 ఏళ్లు ఉంటున్నాంటూ ఇంకా ఎన్నాళ్లు భ్రమల్లోనే బతుకుతావ్… నిన్ను గెలిపించిన పులివెందుల కోసం ప్రజల కోసమైనా అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్యే వైఎస్ జగన్ కు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖమంత్రి ఎస్.సవిత హితబోధ చేశారు. అసెంబ్లీకి వస్తే సబ్జెక్టుపైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి మంత్రి సవిత సోమవారం మాట్లాడారు. ప్రజలను భ్రమలో పెట్టాలని జగన్ భావిస్తున్నారని, ఆయనను నమ్మే స్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతోందని, ఇంకా రాజారెడ్డి రాజ్యాంగమే కొనసాగుతోందని జగన్ అనుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. జగన్ మాటలను నమ్మేస్థితిలో జనాలు లేరని, రాష్ట్రాభివృద్ధి ఎవరితో సాధ్యమని గ్రహించే ఆయనకు 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని అన్నారు. పరామర్శకు వెళ్లినప్పుడు ఆసుపత్రిలో ఎలా మెలగాలో కూడా తెలియడం లేదని, ఎన్నికల కోడ్ ఉంటుండగా గుంటూరు మిర్చి యార్డుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. జగన్ కు ఎక్కడ ఎలా మెలగాలో కూడా తెలియకపోవడం శోచనీయమన్నారు.
మైక్ ఇస్తాం రా…
ప్రజా సమస్యలపై మాట్లాడానికి అసెంబ్లీకి రావాలని, కనీసం నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజల కోసమైనా సభకు రావాలని జగన్ నుద్దేశించి మంత్రి సవిత కోరారు. ప్రజల కోసం పోరాటం చేయండి…ప్రజా సమస్యలపై మాట్లాడండి తప్పనిసరిగా మైక్ ఇస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ కు ఎందరో సలహాదారులు ఉంటారని, వారందరి సలహాలు సూచనలు తీసుకుని అసెంబ్లీకి రావాలని, ఏ సబ్జెక్టుపైనైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సవాల్ విసిరారు.
జగన్ కు మెసేజ్ లు పంపండి…
మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, మాజీ సీఎంగా, మాజీ ఎంపీగా, పులివెందుల ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో జగన్ కు తెలియదా…? అని మంత్రి సవిత ఎద్దేశారు. మేధావులు, నిపుణులు స్పందించి, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో..? జగన్ కు మెసేజ్ రూపంలో తెలియజేయాలని మంత్రి కోరారు. కేవలం ఎనిమిది నెలలో రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం చంద్రబాబునాయుడు పరుగులు పెడుతుండడతో, జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు.
Prajavartha Online Telugu News