-పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు. వి I.A.S.,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సిద్ధం చేయడం మన బాధ్యత అని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు. వి I.A.S., అన్నారు. మంగళవారం పాఠశాల విద్యా శాఖ, ప్రభుత్వ పరీక్షల విభాగం సహకారంతో పరఖ్ (PARAKH: Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) ఆధ్వర్యంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు (HPCs), ప్రామాణిక ప్రశ్నాపత్రాల నమూనాలు సిద్ధం చేయడానికి విజయవాడలో మంగళవారం వర్క్ షాప్ ప్రారంభించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు వి, I.A.S., ముఖ్య అతిథిగా, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు, I.A.S., విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు వి, I.A.S., మాట్లాడుతూ.. ప్రపంచం వేగంగా మారిపోతున్న నేపథ్యంలో విద్యా విధానాలు కూడా నవీకరించాల్సిన అవసరం ఉందని, ప్రశ్నాపత్రాలు విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేలా ఉండాలని పేర్కొన్నారు.
అనంతరం సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు, I.A.S., మాట్లాడుతూ, నూతన విద్య విధానం (NEP) లక్ష్యాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో కీలకమైన సంస్కరణ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల అమలు అని అన్నారు. ఉపాధ్యాయులే విద్యా మార్పునకు కీలకమైన శక్తి. వారి చొరవ, అంకితభావమే విద్యా పరంగా గణనీయమైన అభివృద్ధికి దారితీస్తుందన్నారు.
కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి, ఫరఖ్ – ఎన్సీఈఆర్టీ ప్రతినిధులు, ప్రభుత్వ పరీక్షల విభాగం సిబ్బంది, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ఆన్ లైన్ ద్వారా NCERTలో పరఖ్ CEO ప్రొఫెసర్ (డాక్టర్) ఇంద్రాణి భాదురి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News