-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న వృత్తి విద్యా శిక్షకులకు (ఒకేషనల్ ట్రైనర్లకు) ఐదు రోజుల పాటు శిక్షణ శుక్రవారం ప్రారంభించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., తెలిపారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 9 నుండి 12 తరగతుల విద్యార్థులకు 10 ట్రేడుల్లో వృత్తి విద్యా కోర్సు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మరింత నైపుణ్యంతో కూడిన విద్యను అందించడానికి ఒకేషనల్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
తొలి విడతలో భాగంగా ఐటీ విభాగానికి మేరి స్టెల్లా కాలేజీ(విజయవాడ)లో, అగ్రికల్చర్, ఫుడ్ ప్రోసెసింగ్, హెల్త్ కేర్, గృహోపకరణలు, దుస్తులు తయారీ వంటి విభాగాలకు సెయింట్ జోసెఫ్స్ కళాశాల(గుంటూరు)లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నుండి మార్చి 4 వరకు తొలి విడత శిక్షణ జరుగుతుందన్నారు.
మార్చి 7 నుండి రెండో విడత శిక్షణ
రెండో విడతలో భాగంగా మార్చి 7 నుండి 11వరకు మిగిలిన ట్రేడులు బ్యూటీ అండ్ వెల్ నెస్, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరియు బీమా, రిటైల్, ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ & హార్డ్ వేర్ అంశాల్లోని ట్రైనర్లకు శిక్షణ ఉంటుందన్నారు. పది ట్రేడుల్లో దాదాపు 2వేలకు పైగా శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News