మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధులు రూ.45 లక్షలతో మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులను వివరిస్తూ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరుగుతున్న దృష్ట్యా అదనంగా మంచాలు, ఎక్సరే వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లో బెడ్లు, టేబుళ్ళు, ఐసియు బెడ్లు వంటివి అవసరం ఉందని కలెక్టర్కు తెలిపారు. రూ.20 లక్షలతో ఎక్సరే సీఆర్ సిస్టమ్, అదేవిధంగా మిగిలిన పరికరాల కొనుగోలుకు మరో రూ.25 లక్షల సిఎస్ఆర్ నిధులు మంజూరు చేస్తామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సమావేశంలో మచిలీపట్నం సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి ఆశాలత, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం జయకుమార్, సిపిఓ గణేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News