– పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా సమన్వయంతో పనిచేయండి
– క్షేత్రస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మార్చి 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,29,913 పెన్షన్లకు రూ. 98.20 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని.. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి పెన్షన్ల పంపిణీ సజావుగా సాగేలా కృషిచేయాలన్నారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్డీఏ పీడీ, ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేలా దిశానిర్దేశం చేశారు. శనివారం ఉదయం 7 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించి, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. పంపిణీ సమయంలో ఇబ్బందిలేకుండా ఉండేందుకు పెన్షన్ రకాన్నిబట్టి నగదు మొత్తాన్ని బండిల్గా సిద్ధం చేసుకోవాలన్నారు. రెండో తేదీ ఆదివారం కావున పెన్షన్ల పంపిణీ ప్రక్రియను మూడో తేదీ నాటికి 100 శాతం పూర్తిచేయాలన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పెన్షన్ పంపిణీ చేయాల్సి వస్తే అందుకు తగిన కారణాన్ని ఎన్టీఆర్ భరోసా మొబైల్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుందని.. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పాఠశాల లేదా కళాశాలలోని విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు, సిగ్నల్ సమస్య, నరేగా పనిప్రాంతం.. తదితర కారణాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అనుగుణంగా యాప్లో చేసిన ఏర్పాట్లపై సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సమావేశం ఏర్పాటు చేసి పెన్షన్ల పంపిణీకి సంబంధించిన వివరాలను తెలియజేయాలని, అదేవిధంగా పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. టెలీకాన్ఫరెన్స్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, తిరువూరు ఆర్డీవో కె.మాధురి, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News