– మసీదుల వద్ద ట్రాఫిక్, భద్రత, పారిశుద్ధ్య చర్యలు
– తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని.. ఈ నేపథ్యంలో మార్చి 2 నుంచి 30వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై సమన్వయ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేసేందుకు కలెక్టర్ లక్ష్మీశ శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మునిసిపల్, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. తెల్లవారుజామునే ముస్లిం సోదరులు మసీదులకు వెళ్లి నమాజ్ చేస్తారని.. అందుకు తగ్గట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రార్థన సమయానికి ముందే తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం కలగకుండా మసీదుల వద్ద విద్యుత్తు లైన్లను తనిఖీ చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పోలీస్ యంత్రాంగం మసీదుల వద్ద శాంతిభద్రతలను పర్యవేక్షించాలన్నారు. పెద్ద, చారిత్రక మసీదుల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని.. ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఆహార సామాగ్రి కొనుగోలు చేయడానికి దుకాణాలు అందుబాటులో ఉండేలా అనుమతులు మంజూరు చేయాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రార్థనలు ఆచరించే ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు గంట ముందే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, జిల్లా వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఎండీ నూహూ అలీషా, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News