విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగినప్పుడే జీవితంలో సైతం గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించగలరని, చదువుతో పాటు ఆటలు జీవితంలో భాగంగా చేసుకోవాలని డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయి సుధాకర్ అన్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో ప్రతిభ చూపిన విద్యార్థుల అభినందన సభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిధిగా హజరైన ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయి సుధాకర్ మాట్లాడుతూ కష్టపడి కాకుండ ఇష్టపడి చదవడం, క్రమశిక్షణ, నైపుణ్యాలను పెంచుకోవడం వల్ల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయడం వలన మానసికంగా, శారీరకంగా దృడంగా తయారవుతారన్నారు. అలాగే క్రీడలను కూడా జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లా పత్తిపాడులోని ఏఎస్ఆర్ హోమియోపతి వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈ నెల 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి స్పోర్ట్ అండ్ గేమ్స్ మీట్ ఆయుర్వేద కళాశాల విద్యార్థులు వాలీబాల్, రన్నింగ్, షార్ట్ ఫుట్, లాంగ్ జంప్ తదితర విభాగాల్లో ప్రతిభ చూపి బహుమతులు అందుకోవడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీయార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం స్పోర్ట్ సెక్రటరీ డాక్టర్ ఈ. త్రిమూర్తి, డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లు డాక్టర్ నిర్మలా జ్యోతి బాయి, కోలా విజయ కుమారి, స్పోర్ట్ ఇన్చార్జి డాక్టర్ డి. అనిల్ కుమార్, అధ్యాపకులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News