-కేంద్రమంత్రి ఖట్టర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై సిఎం… కేంద్రమంత్రితో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవి. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి, ఆర్థిక సాయం అందించండి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోట్ ను కేంద్రమంత్రికి సమర్పించారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు ఆమోదించారు. విశాఖపట్నం, విజయవాడ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని సిఎం తెలిపారు. కీలక పారిశ్రామిక కేంద్రమైన విశాఖపట్నంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తికానుందున, అప్పట్లోగా మెట్రో కారిడార్ను జాతీయ రహదారులతో అనుసంధానించడం చాలా ముఖ్యం. మొదటి దశలో ప్రధాన పట్టణ కేంద్రాలను అనుసంధానించడం లక్ష్యం. తర్వాత విమానాశ్రయం వరకు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.
రాజధాని అమరావతికి గేట్ వే గా విజయవాడ మెట్రో వ్యవస్థ ఏర్పాటుతో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయాలని నిర్ణయించాం. విజయవాడ పరిసరాల్లో ఆర్థిక వృద్ధికి తోడ్పడటానికి ఇది చాలా అవసరం. నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యమైనదిగా పరిగణించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోంది… మెట్రో ప్రాజెక్టులను స్వతహాగా నిర్మించే పరిస్థితుల్లో లేదు. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు 100% కేంద్ర సహాయాన్ని అందించాల్సిందిగా సిఎం కోరారు. సకాలంలో ప్రాజెక్టును గ్రౌండ్ చేసేందుకు ఫేజ్- 1 అనుమతులు, భూసేకరణకు కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఈ ప్రాజెక్టులు వల్ల వాయు కాలుష్యం తగ్గడమేగాక, ట్రాఫిక్ సమస్య పరిష్కారమై దీర్ఘకాలిక ఆర్థికవృద్ధికి దోహదపడుతుందని కేంద్రమంత్రి ఖట్టర్ కు సిఎం చంద్రబాబు వివరించారు.
Prajavartha Online Telugu News