విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం ధర్నాచౌక్ వద్ద వర్గీకరణపై ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొవాలని నిరసన సభ నిర్వహించారు. దీనికి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ మాదిగ అధ్యక్షత వహించారు. ప్రధాన వ్యక్తగా విచ్చేసిన బ్రహ్మయ్య మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లను ఎ, బి, సి, డిలుగా వర్గీకరించాలని 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈడుమూడి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఏర్పడిన విషయం తెలిసిందే అనాటి నుండి ఉద్యమ పోరాట ఫలితంగా 1996లో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సి వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడం కోసం రామచంద్రరాజు కమీషన్ ఏర్పాటుచేయడం దాని నివేదిక ఆధారంగా ఎస్సీలోని 59 కులాల విద్య, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయరంగాలలో వర్గీకరణ చేసి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. అయితే మాల సామాజిక వర్గానికి చెందిన కొందరు సుప్రీంకోర్టుని ఆశ్రయించి అడ్డుకొవటం జరిగింద న్నారు. మరలా తాము సుప్రీం కోర్టును ఆశ్రయించగా గత ఏడాది ఆగష్టు 1న సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చు అనే తీర్పును ఇచ్చారన్నారు. అందుకనుగుణంగా రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమీషన్ ఏర్పాటు చేసి వర్గీకరణను పరిష్కరించటానికి చర్యలు చేపట్టారన్నారు. ఈ ధర్నాలో రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్కుమార్ మాదిగ, గుండాల ఆనంద్ మాదిగ, పరసా రామయ్య, మారబత్తుల గోపాల్, కనకపూడి వెంకటరత్నం, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News